ఆహార భద్రతపై కాజల్ అవగాహన ప్రచారం.
జనం వాయిస్, హైదరాబాద్, జులై 17:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన తాజా చిత్రం ‘ది ఇండియన్ స్టోరీ’ ప్రచారంలో భాగంగా ఆహార భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురుగుమందుల అధిక వినియోగం, ఆహార కల్తీ, వాటి వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని ఈ చిత్రం ప్రధాన అంశంగా తీసుకురావడంతో, అదే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాజల్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని ప్రారంభించారు. తన భోజనానికి సంబంధించిన చిత్రాన్ని పంచుకుంటూ, మనం తినే ఆహారం నిజంగా సురక్షితమేనా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ తాము తీసుకునే ఆహారం నాణ్యతపై మరింత అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో పాల్గొనాలని హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంతలకు కూడా సవాల్ విసిరారు.
సినిమాలో కీలక పాత్ర పోషించిన శ్రేయస్ తల్పడే కూడా ఈ ప్రచారానికి మద్దతు తెలిపారు. బాధ్యతాయుతమైన వినియోగదారులుగా మారాల్సిన అవసరం ఉందని, మనం తినే ఆహారం వెనుక ఉన్న వాస్తవాలపై చర్చ జరగాలని ఆయన పేర్కొన్నారు.
చేతన్ డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఇండియన్ స్టోరీ’ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పడే ప్రధాన పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, ఎమ్ఐజీ ప్రొడక్షన్ స్టూడియోస్ సమర్పణలో సాగర్ బి. షిండే నిర్మించిన ఈ చిత్రం జులై 24న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం కాజల్ ప్రారంభించిన ఈ అవగాహన ప్రచారానికి సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది.