ఉండవల్లిలో అరటి తోట సందర్శించిన బిల్ గేట్స్.
– వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక వినియోగం ప్రదర్శన.
– రైతులకు కృత్రిమ మేధ ఆధారిత సలహాలు.
జనం వాయిస్, అమరావతి, ఫిబ్రవరి 16:
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉండవల్లిలోని అరటి తోటను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికతను ముఖ్యమంత్రి వివరించారు. ఉండవల్లికి విచ్చేసిన బిల్ గేట్స్కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అరటి తోటలో డ్రోన్ల సహాయంతో మందులు పిచికారీ చేసే విధానాన్ని ప్రదర్శించారు. వ్యవసాయంలో సాంకేతిక వినియోగం రైతులకు ఎలా ఉపయోగపడుతుందో బిల్ గేట్స్ ఆసక్తిగా పరిశీలించారు. రైతులు సంప్రదాయాలను గౌరవిస్తూ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పంటలు, మార్కెట్ ధరలు, నేల స్వభావం ఆధారంగా కృత్రిమ మేధ ద్వారా రైతులకు ఖచ్చితమైన సలహాలు అందిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, సుస్థిర పద్ధతులను రాష్ట్రంలో చురుకుగా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అక్కడి రైతులను అభినందించారు. సాంకేతిక ఆధారిత వ్యవసాయ విధానాలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.