ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా జిల్లా కేంద్ర మార్పు అన్యాయం.
– భోగి మంటల్లో జిల్లా మార్పు గెజిట్ ప్రతుల దహనం.
– ప్రజలతో కలిసి వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి నిరసన.
జనం వాయిస్, రాయచోటి:
రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్పు చేసిన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం, యర్రమరెడ్డి గారిపల్లెలోని తన నివాస ఆవరణంలో జిల్లా మార్పుకు సంబంధించిన గెజిట్ ప్రతులను భోగి మంటల్లో దహనం చేస్తూ ఆందోళన చేపట్టారు. ముందస్తు సమాచారం లేకుండా, ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయం రాయచోటి ప్రాంత ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిన చర్యగా ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, ఒకసారి ప్రకటించిన జిల్లాను దేశ చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ మార్పు చేసిన దాఖలాలు లేవన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటైన రాయచోటి జిల్లా కేంద్రాన్ని అకస్మాత్తుగా మార్పు చేయడం ప్రజల ఆశలను నాశనం చేసిన చర్యగా అభివర్ణించారు. ఈ నిర్ణయం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేస్తూ, ఎటువంటి ముందస్తు నోటిఫికేషన్ లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.
కొంతమంది తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేస్తూ జిల్లా కేంద్ర మార్పుపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడి వైఖరి ఏమిటని ప్రశ్నించడం అవివేకమని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జిల్లాను ఇచ్చిన నాయకుడే వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడన్న సత్యాన్ని మరిచిపోవడం దురదృష్టకరమన్నారు. దేశ రాజధానిగా ఢిల్లీ ఉన్నట్టే, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర రాజధానులు, జిల్లా కేంద్రాలు ఉంటాయని తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన రాయచోటి జిల్లా కేంద్ర స్థానంలో ఏమి చేసినా దానికి ధీటుగా ఏదీ రాదన్నారు.
సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ రోజునే రాయచోటి ప్రాంత ప్రజలకు జరిగిన అన్యాయంపై నిరసన తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వానికి భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్థిస్తూ, జిల్లా కేంద్ర మార్పు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను యథాతథంగా కొనసాగించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.