కాంగ్రెస్ అంటేనే అబద్దాలకు కేరాఫ్…
– మంత్రి మెప్పుకోసమే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఆరోపణలు
– రాష్ట్రంలోని ఏ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిండ్లో చెప్పాలే
– గోదావరిఖని చౌరస్తాకు ఆధారాలతో వస్తాం…మీరు వస్తరా..
– అపవిత్రమైన సెక్రటెరియట్ను కాళేశ్వరం జలాలతో శుద్ది చేస్తం
– భూపాలపల్లి మాజీ జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్
జనం వాయిస్ దినపత్రిక, మంథని:
కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్దాల పార్టీ అని, గాంధీభవన్లో ఏ నాయకుడు కూర్చున్నా అబద్దాలు ఆడాల్సిందేనని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ అన్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ తెలంగాణ సెక్రటెరియేట్లోని మంత్రి చాంబర్లో జరిగిన కుంభకోణం బయటపెడుతూ మాట్లాడిన తీరుపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ల మాటలు పూర్తి పచ్చి అబద్దాలని ఆమె వివరించారు. గాంధీభవన్లో కూర్చుండి ఒక పేపర్ చూపించి జూన్ 03న సైఫాబాద్ పోలీస్స్టేషన్లో ఓఎస్టీ ఫిర్యాదు చేశారని బల్మూరి వెంకట్ మాట్లాడాడని, అయితే జూన్ 03న సైఫాబాద్ పీఎస్లో ఓఎస్టీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, వెంకట్ చెప్పిన 67/2025 నంబర్లో జూన్ 14న ఓ వివాహిత తనను ఒకరు వేధిస్తున్నారని కాంప్లైంట్ ఉందన్నారు.

మంత్రి సంతకం పోర్జరీ అయిందని ఓఎస్టీ ఫిర్యాదు చేశారని చెప్పిన మాటల్లో వాస్తవం లేదన్నారు. అలాగే రామగుండం ఎమ్మెల్యే సైతం ఆసిఫ్ నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని మీడియా ముందు వెల్లడించారే కానీ ఎలాంటి ఆధారాలు, కాంప్లైంట్ నంబర్కూడా చెప్పలేదన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన క్రమంలో అంతా ఆన్లైన్లో ఉంటుందనే విషయం కూడా తెలియకుండా ఓ పేపర్ పట్టుకుని మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. జూన్ మాసంలో పూర్తిగా వెతికినా ఎక్కడా ఓఎస్టీ ఫిర్యాదు చేసినట్లు లేదన్నారు. కేవలం మంత్రి మెప్పుకోసమే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇన్నేండ్లుగా ఏనాడు మాట్లాడని మక్కాన్ సింగ్ ఈనాడు మా నాయకుడు పుట్ట మధూకర్పై ఎందుకు విమర్శలు చేస్తున్నారో ఆర్థం కావడం లేదని, మంత్రి నిజస్వరూపం తెలిసి కూడా ఓ బీసీ నాయకుడిని విమర్శించడం తగునా అని ఆమె అన్నారు. కేవలం తమ కుటుంబసభ్యులకు పదవులు ఇప్పించుకునేందుకు ఆరాటపడుతున్నారని అన్నారు. అయితే సెక్రటెరియేట్లో ఎంప్లాయిస్ పర్మిషన్లేకుండా కుంభకోణం జరుగదని స్వయంగా కళ్యాణ్రాజ్ ఫిర్యాదు చేశారని ఆ ఫిర్యాదు సైతం తమ వద్ద ఉందన్నారు. ఐటీ సెక్టార్లో ఓ రాకెట్ జరుగుతుందని క్లియర్గా ఉందని, గవర్నమెంట్పై నమ్మకం పోతుందని వాళ్లపై చర్యలు తీసుకోవాలని కళ్యాణ్రాజ్ ఫిర్యాదులో పేర్కొన్నారని ఆమె వివరించారు. తమ వద్ద అన్ని సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్నామని, కాంగ్రెస్ నాయకుల లెక్క నోటికి ఏది వస్తే అది మాట్లాడటం లేదన్నారు. మంత్రి శ్రీధర్బాబుకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బురదచల్లుతున్నామని మక్కాన్సింగ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ఏ పోలీస్స్టేషన్లోనైనా ఓఎస్టీ ఫిర్యాదు చేసినట్లు ఆధారాలు తీసుకుని గోదావరిఖని చౌరస్తాకు రావాలని, తమ వద్ద ఉన్న ఆధారాలతో తాము వస్తామని, ఆధారాలు చూపిస్తే తమదే తప్పని ఒప్పుకుంటామని, ఏ ఆధారం చూపించకపోతే మంత్రి చాంబర్లో కుంభకోణం జరిగింది వాస్తవమని ఒప్పుకుని ముక్కు నేలకు రాయాలని ఆమె సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ ఎంతో కృషి చేసి ఐటి హబ్ ఏర్పాటు చేసి రాష్ట్రానికి కంపెనీలు, పెట్టుబడులు వచ్చేలా కృషి చేశారని, మన ఉద్యోగాలు మనమే సృష్టించుకోవాలనే గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తారని, ఇదంతా ప్రజలకు తెలుసునన్నారు. అలాంటి గొప్ప సెక్రటిరియేట్ను అపవిత్రం చేశారని, తాము రెండేళ్లలో అధికారంలోకి రావడం ఖాయమని, ఆ వెంటనే మేడిగడ్డ కాళేశ్వరం గోదావరిజలాలలో సెక్రటేరియేట్ను శుద్ది చేస్తామన్నారు. మంత్రి రాత్రి 12గంటల వరకు పనిచేస్తున్నారని గొప్పలు చెప్తున్నారని, ప్రజలకు అందుబాటులో లేని సమయంలో పని చేసి ఏం లాభమని ఆమె ప్రశ్నించారు. అర్థరాత్రి సమయంలో ఎలాంటి వాళ్లు ఎలాంటి పనులు చేస్తారనే విషయం అందరికి తెలుసునని ఆమె హితవు పలికారు. బీసీ ఎస్టీ ఎస్సీల కోసం మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరాటపడుతుంటే అదే సామాజిక వర్గంతో దాడులు చేయిస్తున్నాడనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇకపై ఆధారాలు లేకుండా మా నాయకుడిపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆమె స్పష్టం చేశారు.
