janamvoice.com
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 1:01 am Digital Edition : JANAM VOICE

కిలో ఉల్లిగడ్డలు రూ.32కే

కిలో ఉల్లిగడ్డలు రూ.32కే

సామాన్యులకు ఊరట కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం.
వచ్చే వారం నుంచి రైతు బజార్లు, మొబైల్ కౌంటర్లలో విక్రయాలు.
మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి.

జనం వాయిస్, అమరావతి, సెప్టెంబర్ 09:

నిత్యావసరాల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కిలో ఉల్లిపాయలను రూ.32కే రాయితీ ధరకు విక్రయించాలని నిర్ణయించింది.

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని 115 రైతు బజార్లతో పాటు ప్రత్యేక మొబైల్ కౌంటర్ల ద్వారా రాయితీ ఉల్లిపాయల విక్రయాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఉల్లిపాయలతో పాటు రేషన్ డిపోల ద్వారా కందిపప్పు, పామాయిల్‌ను కూడా రాయితీ ధరలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్ ధరల కంటే సుమారు 30 శాతం తక్కువ ధరకే నాణ్యమైన నిత్యావసర సరుకులను అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మంత్రి నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వంటింటి ఖర్చులు తగ్గి ప్రజలకు కొంత ఆర్థిక ఉపశమనం లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.