janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 2:36 am Digital Edition : JANAM VOICE

క్రికెటర్లకు కాంట్రాక్ట్ శుభవార్త

క్రికెటర్లకు కాంట్రాక్ట్ శుభవార్త

జనం వాయిస్, ముంబై, ఏప్రిల్ 16:

ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు ముంబై క్రికెట్ సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లకు అండగా నిలవాలనే ఉద్దేశంతో తొలిసారిగా కాంట్రాక్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు ఈ కాంట్రాక్ట్‌లు వర్తిస్తాయి. ప్రదర్శన, ఫిట్‌నెస్, సెలెక్షన్ కమిటీ సిఫారసుల ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసి వార్షికంగా పారితోషికం చెల్లించనున్నట్లు సంఘం వెల్లడించింది. పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకు కూడా ఈ విధానం అమల్లోకి రానుంది. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఆటగాళ్లను మూడు గ్రేడ్‌లుగా విభజించనున్నారు. గ్రేడ్ ఏలో ఉన్న వారికి ఏడాదికి సుమారు 12 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు లభిస్తాయి. గ్రేడ్ బీ ఆటగాళ్లకు 8 లక్షల నుంచి 12 లక్షల వరకు, గ్రేడ్ సీ వారికి సుమారు 8 లక్షల రూపాయల వరకు చెల్లించనున్నారు. వీటికి అదనంగా మ్యాచ్ ఫీజులు, అలవెన్సులు, ప్రదర్శన ఆధారిత ప్రోత్సాహకాలు కూడా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ కాంట్రాక్ట్ విధానం ముంబై క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని సంఘం అధ్యక్షుడు అజింక్య నాయక్ పేర్కొన్నారు. ఆటగాళ్లకు ఆర్థిక భరోసా కల్పించడం, ప్రతిభను ప్రోత్సహించడం, ఫిట్‌నెస్ ప్రమాణాలను పెంపొందించడం, పోటీ స్థాయిని మరింత పెంచడం ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యాలుగా తెలిపారు. 2026-27 సీజన్ నుంచే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అమల్లోకి రానుందని సంఘం వెల్లడించింది. దీంతో యువ క్రికెటర్లు ఆటపై మరింత దృష్టి పెట్టి, స్థిరమైన ప్రదర్శన ఇవ్వడానికి ఇది ఉపయోగపడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.