పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది.
జనం వాయిస్ దినపత్రిక, గోదావరిఖని :
గోదావరిఖని కి చెందిన కాంపెల్లి లింగయ్య అనే సింగరేణి కార్మికుని కుమార్తె సుప్రియ ను ఇటీవల డెలివరీ కోసం సింగరేణి ఆసుపత్రిలో చేర్పించారు. సాధారణ పరీక్షలు చేసిన వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో పురిటిలోనే ఆడ శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యులు చికిత్స అందించకపోవడంతోనే డెలివరీ కాకముందే ఆడ శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగి బోరున విలపించారు. వెంటనే ఆపరేషన్ చేస్తే శిశువు బతికేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో వైద్యులు, అత్యవసర చికిత్స అందుబాటులో లేదని బిజెపి నాయకులు కొండపర్తి సంజీవ్ ఆరోపించారు.ఆసుపత్రిలో బంధువులతో పాటు బిజెపి నాయకులు బైఠాయించి నిరసన ప్రదర్శన చేశారు. కార్మికుడు కష్టపడి పనిచేసి లాభాలు గడిస్తే కుటుంబ సభ్యులకు చికిత్స అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. కనీసం స్కానింగ్ మిషన్ అందుబాటులో లేకపోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
