నూతన ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు.
– ఉండవల్లిలో భేటీ పరిపాలనపై తొలి మర్యాదపూర్వక సమావేశం.
జనం వాయిస్, అమరావతి, మార్చి 01:
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి శిబిర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇది ఆయన తొలి భేటీగా నిలిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగానికి అధిపతిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందించారు. పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఇద్దరి మధ్య కొద్దిసేపు చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక బాధ్యతలు స్వీకరించిన విజయానంద్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రికి పదవీ హోదా ప్రకారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన విజయానంద్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర పరిపాలనలో సమన్వయం, వేగవంతమైన నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఈ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది.