ప్రాజెక్టుల నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పించారు: ప్రియాంక.
జనం వాయిస్, సినిమా, జూలై 24:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా తన సినీ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. అవకాశాల కోసం తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి లేదా ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టడానికి ఎప్పుడూ సిద్ధపడలేదని ఆమె తెలిపారు. తాజా ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ, కొందరిని మెప్పించలేదనే కారణంతో, మరికొందరి అంచనాలకు అనుగుణంగా నడుచుకోలేదనే కారణాలతో తనను కొన్ని పెద్ద ప్రాజెక్టుల నుంచి ఉద్దేశపూర్వకంగానే తప్పించారని పేర్కొన్నారు.
“నాకు కొన్ని వ్యక్తిగత విలువలు ఉన్నాయి. అవకాశాల కోసం వాటిని వదులుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అందరినీ సంతృప్తిపరిచే ప్రయత్నం చేయకపోవడం వల్ల కొన్ని మంచి అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది” అని ప్రియాంక వెల్లడించారు. బాలీవుడ్లో వరుస విజయాల తర్వాత హాలీవుడ్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ప్రియాంక, ప్రస్తుతం దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రంలో మహేష్ బాబు సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్నారు.