ప్రేమిస్తున్నానంటూ నాలుగేళ్లు వెంటపడ్డాడు..
జనం వాయిస్, సినిమా:
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి అంజలి తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటనను అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తనకు వచ్చిన తొలి ప్రేమ ప్రతిపాదన గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
అంజలి 2006లో విడుదలైన ‘కత్రదు తమిళ్’ చిత్రంతో కథానాయికగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని తమిళంలో వరుస అవకాశాలు అందుకున్నారు. అనంతరం ‘షాపింగ్ మాల్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సహా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించారు. ఇటీవల రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’లో కీలక పాత్రలో కనిపించిన ఆమె, ప్రస్తుతం తమిళంలో రూపొందుతున్న ‘మకుటం’ చిత్రంలో నటిస్తున్నారు.
ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మాట్లాడిన అంజలి తన పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు తన తరగతి సహచరుడు ఒకరు ప్రేమిస్తున్నానంటూ తన వెంటపడేవాడని తెలిపారు. తాను అతడికి ప్రేమ లేదని స్పష్టంగా చెప్పినా అతడు వినలేదని, చివరకు ధైర్యం ఉంటే తనకు రాఖీ కట్టాలని సవాలు విసిరాడని చెప్పారు.
ఆ సవాలును వెంటనే స్వీకరించిన తాను రాఖీ తీసుకెళ్లి అతడికి కట్టేశానని అంజలి వెల్లడించారు. దీంతో కోపంతో అతడు రాఖీ తీసి పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడని, ఆ తర్వాత మళ్లీ తనకు ఎప్పుడూ ఎదురుకాలేదని తెలిపారు. ఈ సంఘటనతో ఆ ప్రేమ వ్యవహారం అక్కడితో ముగిసిపోయిందని ఆమె నవ్వుతూ చెప్పారు.
అంజలి చెప్పిన ఈ సంఘటన ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె నిజాయితీగా చెప్పిన ఈ అనుభవంపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చిస్తున్నారు. మరోవైపు ఆమె నటిస్తున్న ‘మకుటం’ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో నటుడు విశాల్ కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకుడిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.