janamvoice.com
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 2:08 am Digital Edition : JANAM VOICE

ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్వాడీ టీచర్లతో ఎస్ఐ దురుసు ప్రవర్తన.

ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్వాడీ టీచర్లతో ఎస్ఐ దురుసు ప్రవర్తన.

ఎస్పీని ఆశ్రయించిన బాధితులు.

జనం వాయిస్, మహబూబాబాద్, ఆగష్టు 04:

తమను వేధించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంగన్వాడీ టీచర్లతో ఎస్ఐ దురుసు ప్రవర్తన వివాదస్పదమయింది.  ఎస్ఐ ప్రవర్తనతో మనస్తాపం చెందిన అంగన్ వాడీ టీచర్  స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో తమను వేధించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసేందుకు అంగన్వాడీ టీచర్ ఆవుల మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఇద్దరినీ, మహిళలని కూడా చూడకుండా దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్ బూతులు తిడుతూ అవమానపరిచాడని మహిళలు ఆరోపించారు. తన ఛాంబర్లోకి పిలిచి ఎస్ఐ తమను, తమ భర్తలను అసభ్య పదజాలంతో దూషించాడని, తొక్కి చంపుతామని బెదిరించాడని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేసారు. ఎస్ఐ ప్రవర్తనతో తీవ్ర ఆవేదనకు గురై స్పృహ కోల్పోయిన మంజులను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. తమను అవమానించిన ఎస్ఐను సస్పెండ్ చేయకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యమని, తొర్రూరు సీఐ గణేష్కు కుడా  బాధితులు పిటిషన్ ఇచ్చారు. మేము బాత్రూమ్కు వెళ్తున్న వీడియోలు తీసి వేధిస్తున్నాడు.  నరేష్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా మేము స్కూల్లో పని చేస్తున్న సమయంలో మా పర్సనల్ వీడియోలు, బాత్రూమ్కు వెళ్లే వీడియోలు తీసి వేధిస్తున్నాడని దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్కు ఈ నెల 1వ తేదీన ఫిర్యాదు చేశామని అన్నారు. ఎస్ఐ మాకు న్యాయం చేస్తానని నమ్మించి, మమ్మల్ని పోలీస్ స్టేషన్కు పిలిపించి, మేము ఫిర్యాదు చేసిన వ్యక్తి ముందే మమ్మల్ని ఘోరంగా దూషిస్తూ అవమానపరిచాడని బాధతులు వాపోయారు.