భూమి వివాదం…కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం.
– కోర్టు ఆదేశాలు అమలు కాలేదని ఆరోపణ.
– పెట్రోల్ పోసుకుని నిరసన తెలిపిన యువకుడు.
జనం వాయిస్, చిత్తూరు, ఫిబ్రవరి 16:
భూ వివాదంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. వెదురు కుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామానికి చెందిన సాయికుమార్ ఈ చర్యకు దిగినట్లు సమాచారం. తన భూమికి సంబంధించిన సమస్యపై న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ వాటిని అమలు చేయడం లేదని సాయికుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నాడు.
కలెక్టరేట్ ప్రాంగణంలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో అక్కడి సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. “ఈరోజు చనిపోతే రేపటి నుంచి ఆలోచించే పని ఉండదు” అంటూ సాయికుమార్ భావోద్వేగంతో మాట్లాడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. భూ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.