janamvoice.com
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 12:44 am Digital Edition : JANAM VOICE

మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలు నిరాధారం: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.

మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేతల ఆరోపణలు నిరాధారం: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.

జనం వాయిస్ దినపత్రిక :

మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, పుట్ట మధు రాజకీయ దురుద్దేశ్యంతోనే అసత్యాలను ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. మీరు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా… మంత్రి శ్రీధర్ బాబు ఏంటో, ఆయన కుటుంబం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని ఆయన అన్నారు. ఆదివారం గాంధీ భవన్లో ఎమ్మెల్సీ వెంకట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులను అడ్డుకోవడానికి, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వంపై ప్రజల్లో అపనమ్మకం సృష్టించడానికే కేటీఆర్ స్వీయ దర్శకత్వంలో కొందరు బీఆర్ఎస్ నాయకులు ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా శ్రీధర్ బాబు మంత్రిగా పనిచేస్తున్నారని, రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వచ్చేలా చేసి, ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నారని బల్మూరి వెంకట్తెలిపారు.మంత్రి శ్రీధర్ బాబును బద్నాం చేయాలన్న కుట్రతోనే బీఆర్ఎస్ నేతలు అసత్యాలను ప్రచారం చేస్తూ ఆనందం పొందుతున్నారన్నారు. దొంగల పార్టీలో ఉన్న దొంగలే ఇప్పుడు దొంగ దొంగ అని అరుస్తూ, నీతులు వల్లే వేస్తూ ఎదుటి వారి పైకి వేలెత్తి చూపుతున్నారని బల్మూరి వెంకట్ మండిపడ్డారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోమని ఫిర్యాదు చేసిన వారిపైనే… బురద చల్లడం, చిల్లర రాజకీయాలు చేయడం తెలంగాణలో తప్ప ఎక్కడా కనిపించదని ఆయన విమర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీ పేరిట నకిలీ లెటర్ హెడ్స్ ను ఎవరో బయట వ్యక్తులు సృష్టించి ఐటీ ప్రాజెక్టులు ఇప్పిస్తామంటూ బాధితుల నుంచి రూ.1.77 కోట్లు వసూలు చేశారని, ఇందులో మంత్రి శ్రీధర్ బాబు పేషీకి గానీ, మంత్రి వ్యక్తిగత, ఇతర సిబ్బందికి గానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ విషయం శ్రీధర్ బాబు దృష్టికి రాగానే ఆయన వెంటనే అప్రమత్తమయ్యారని, సిబ్బందిని అప్రమత్తం చేసి బాధితులతో మాట్లాడి పూర్తి వివరాలను తెలుసుకున్నారని బల్మూరి వెంకట్ చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ ఓఎస్డీని ఆదేశించారని, ఆయన స్వయంగా జూన్3న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో నా నకిలీ లెటర్ హెడ్స్ మోసానికి పాల్పడిన ఓడూరి వీవీ సత్యనారాయణ అలియాస్ సతీష్ అండ్ గ్యాంగ్ మొత్తం 6 మందిపై ఫిర్యాదు చేశారన్నారు.ఆ రోజే అంటే సైఫాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా మాట్లాడి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఎమ్మెల్సీ వెంకట్చెప్పారు. ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దని మంత్రి సూచించారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారని, ఓఎస్డీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైఫాబాద్ పోలీసుల ఆ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించారని, ప్రస్తుతం కేసును హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు బల్మూరి వెంకట్ చెప్పారు.