మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణకు సూచించా.
మంత్రి పదవి అంశం అధిష్ఠానం నిర్ణయమే.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్.
జనం వాయిస్, హైదరాబాద్, సెప్టెంబర్ 09:
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ, మంత్రుల శాఖల మార్పుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో మీడియాతో జరిగిన అనౌపచారిక చిట్చాట్లో ఆయన పలు అంశాలపై స్పందించారు.
ప్రస్తుత కేబినెట్లోని మంత్రుల శాఖలను సమూలంగా పునర్వ్యవస్థీకరించి, అవసరానికి అనుగుణంగా కొత్త శాఖలను కేటాయించాలనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీసీసీ అధ్యక్షుడిగా తన పరిధిలో ఈ సూచన చేసినట్లు చెప్పారు.
అయితే మంత్రుల శాఖల మార్పు, కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానానిదేనని స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి దక్కుతుందా? అన్న అంశంపై కూడా ఆయన స్పందించారు. తనను మంత్రివర్గంలోకి తీసుకునే విషయాన్ని పూర్తిగా అధిష్ఠానం నిర్ణయానికే వదిలేశానని పేర్కొన్నారు.
ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని మరింత బలోపేతం చేయడంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు.