-సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు
-కొందరి పనితీరులో ఇంకా మార్పు రాలేదు
-ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్.
జనం వాయిస్,తెలంగాణ డెస్క్:
ప్రభుత్వ పథకాలు,అభివృద్ధి పనులను అమలు చేయ టంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు,విభాగ అధిపతులను హెచ్చరించారు.ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అలసత్వం వీడాలని సూచించారు.ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దని,అన్ని విభాగాల సమన్వయంతో ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు,కార్యక్రమాలకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని అన్నారు.ఇవాళ సీఎం తన నివాసంలో సీఎంవో కార్యదర్శులు,సీఎస్ రామకృష్ణా రావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విష యంలో అధికారులు మరింత చురుగ్గా పని చేయాలని సూచించారు.అన్ని విభాగాల కార్యదర్శుల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని,పనుల పురోగతిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు.ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సీఎంవో అధి కారులను ఆదేశించారు.
ఇక పనితీరు ఆధారంగా పోస్టింగ్లు..
కంఫర్డ్ జోన్లలో ఉండే అధికారులకు కాకుండా, పనితీరు ఆధారంగా పోస్టింగ్లు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఏసీ గదుల్లో కూర్చొని పని చేయకుండా, పైరవీలతో సమ యం గడుపుతున్న అధికారులను ఉద్దేశించి సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘గతంలో కూడా అధికా రులు ఏసీ గదుల నుంచి బయటకు రావడం లేదు.. ఫీల్డ్ విజిట్లు చేయాలని పదే పదే చెప్పినా పట్టించుకోవడం లేదు… ఇలా ఉంటే ప్రజలకు సేవ ఎలా చేస్తారు?” అంటూ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు.
ఏ ఫైలూ ఆగొద్దు..
ఇకపై ఏ ఫైలు ఆగిపోవడానికి, పనులు ఆగిపోవడానికి వీల్లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టుకునే కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఏయే పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే, కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందో, వాటికి ముందుగా ప్రాధాన్యమి వ్వాలని సూచించారు. ఇకపై సీఎస్ తో పాటు సీఎంవో అధికారులు తమ పరిధిలోని విభాగాలపై ప్రతి వారం తనకు నివేదికలు అందించాలని, తానే స్వయంగా వాటిపై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.