వాట్సాప్లో కొత్త ఫీచర్.. పర్సనల్, బిజినెస్ చాట్స్ వేర్వేరు!
జనం వాయిస్, న్యూఢిల్లీ, ఏప్రిల్ 16:
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం మరో ఉపయోగకరమైన ఫీచర్ను తీసుకురానుంది. ‘ఆటో-ఆర్గనైజ్ బిజినెస్ చాట్’ అనే ఈ కొత్త ఆప్షన్ ద్వారా వ్యక్తిగత చాట్స్, వ్యాపార చాట్స్ను వేర్వేరుగా సర్దుబాటు చేసే అవకాశం కలుగనుంది. ప్రస్తుతం చాలా మంది యూజర్లు బిజినెస్ ఖాతాల నుంచి వచ్చే ప్రకటనలు, ప్రమోషనల్ మెసేజ్ల వల్ల తమ ముఖ్యమైన పర్సనల్ చాట్స్ మిస్ అవుతున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ కొత్త ఫీచర్ పనిచేయనుంది. ఇకపై బిజినెస్ అకౌంట్ల నుంచి వచ్చే సందేశాలు ఆటోమేటిక్గా ఒక ప్రత్యేక ఫోల్డర్లోకి వెళ్లిపోతాయి. అయితే, ఈ ఫీచర్లో ప్రత్యేకత ఏమిటంటే… ఏదైనా బిజినెస్ మెసేజ్ వచ్చిన వెంటనే అది తొలగిపోదు. మొదటి 24 గంటల పాటు అది మీ మెయిన్ చాట్ లిస్ట్లోనే కనిపిస్తుంది. దీంతో మీరు ఆ మెసేజ్ను గమనించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ చాట్ ఆటోమేటిక్గా బిజినెస్ సెక్షన్కు మారిపోతుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ల ఇన్బాక్స్ మరింత క్లీన్గా మారుతుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో చేసే చాట్స్ మాత్రమే ప్రధానంగా కనిపిస్తాయి. స్పామ్ మెసేజ్ల గోల కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్లో పరీక్ష దశలో ఉంది. త్వరలోనే అన్ని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మొత్తానికి… ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ వినియోగాన్ని మరింత సులభంగా, క్రమబద్ధంగా మార్చనుంది.