janamvoice.com
Newspaper Banner
Date of Publish : 09 April 2026, 1:33 pm Digital Edition : JANAM VOICE

విందులో విషాదం.. ప్రాణం తీసిన మాంసం ముక్క.

విందులో విషాదం.. ప్రాణం తీసిన మాంసం ముక్క.

జనం వాయిస్, మహబూబాబాద్:

మహబూబాబాద్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. విందు భోజనం చేస్తుండగా మాంసం ముక్క గొంతులో ఇరుక్కోవటంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గూడూరు మండలం పిల్లిగుండ్ల తండాలో మంగళవారం దుర్గమ్మ పండుగ జరిగింది. 45 ఏళ్ల బానోత్ బిచ్చా తన బంధువులతో కలిసి రాత్రి విందు భోజనం ఏర్పాటు చేసుకున్నాడు. విందు భోజనం చేస్తుండగా ఊహించని విషాదం చోటుచేసుకుంది.

మాంసం ముక్క బానోత్ బిచ్చా గొంతులో ఇరుక్కుంది. దీంతో ఆయన ఊపిరి ఆడక ఇబ్బందిపడసాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు గొంతులో ఇరుక్కున్న మాంసం ముక్కను బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయినా లాభం లేకపోయింది. దీంతో గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బానోత్ బిచ్చాను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన చనిపోయినట్లు ధ్రువీకరించారు. ఇక, ఈ సంఘటనపై సమాచారం అందుకున్న గూడురు ఎస్సై గిరిధర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరో ఘటనలో..

కొద్దిరోజుల క్రితం ఒడిశా రాష్ట్రంలోని మయుర్‌భంజ్ జిల్లాకు చెందిన అభినాశ్ బిజులీ అనే యువకుడు చేప గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. గత శుక్రవారం చెరువులో చేపలు పడుతుండగా అతడికి ఇండియన్ కోయ్ జాతికి చెందిన చేప చిక్కింది. చేప తప్పించుకోకుండా ఉండటానికి దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. అదే అతడి ప్రాణాలు తీసింది. ఆ చేప గొంతులోకి దూరింది. దీంతో అభినాశ్ ఊపిరి ఆడక అల్లాడిపోయాడు. కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభినాశ్ ప్రాణాలు కోల్పోయాడు..