శ్రీకాకుళం డీసీసీబీ 90వ వార్షికోత్సవం సందర్భంగా ‘నవతి ప్రత్యేక డిపాజిట్ పథకం’ ప్రారంభం.
– నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో పథకం ఆవిష్కరణ.
– సీనియర్ సిటిజన్లకు 9 శాతం, ఇతరులకు 8.5 శాతం వడ్డీ.
– రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి అచ్చన్నాయుడు.
జనం వాయిస్, నిమ్మాడ, డిసెంబర్ 25:
శ్రీకాకుళం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 90వ ఏడాదిలోకి ప్రవేశిస్తున్న శుభసందర్భంగా ‘నవతి ప్రత్యేక డిపాజిట్ పథకం’ను నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యాంకు అభివృద్ధిలో ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.సామాన్య ప్రజలు, రైతుల పొదుపుపై గరిష్ట లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక పథకాన్ని రూపొందించినట్లు మంత్రి వివరించారు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 9 శాతం వడ్డీ, ఇతర ఖాతాదారులకు 8.5 శాతం వడ్డీ అందించనున్నట్లు తెలిపారు. 900 రోజుల కాలపరిమితి కలిగిన ఈ డిపాజిట్ పథకం ప్రజలకు ఆర్థిక భద్రత కల్పిస్తుందని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించడంతో పాటు రైతులకు ఆర్థికంగా బలం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చన్నాయుడు స్పష్టం చేశారు. ఈ పథకాన్ని రైతులు, సామాన్య ప్రజలు విస్తృతంగా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. సహకార బ్యాంకుల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. శ్రీకాకుళం డీసీసీబీ అమలు చేస్తున్న ఇలాంటి పథకాలు గ్రామీణాభివృద్ధికి మరింత దోహదపడతాయని అన్నారు.