janamvoice.com
Newspaper Banner
Date of Publish : 28 April 2026, 5:03 pm Digital Edition : JANAM VOICE

హిందీపై సాయి పల్లవికి ట్రోల్..

హిందీపై సాయి పల్లవికి ట్రోల్..

సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తాజాగా సామాజిక మాధ్యమాల్లో విమర్శలకు గురవుతున్నారు. ఆమె నటించిన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ముంబైలో నిర్వహించిన ‘ఏక్ దిన్ కీ మెహఫిల్’ కార్యక్రమంలో ఆమె హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే తనకు ఆ భాషపై పూర్తి పట్టు లేదని నిజాయితీగా చెప్పడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఈ కార్యక్రమంలో ఆమె తడబడుతూ మాట్లాడిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో, ముఖ్యంగా ఉత్తర భారత ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణలో సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్న విషయం చర్చకు వచ్చింది. కనీసం హిందీ రాని నటిని ఆ పాత్రకు ఎలా ఎంపిక చేశారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో సాయి పల్లవి స్వయంగా డబ్బింగ్ చెబుతారా లేదా వేరొకరితో చెప్పిస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విమర్శలకు ఆమె అభిమానులు గట్టిగా ప్రతిస్పందిస్తున్నారు. గతంలో కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి నటీమణులు కూడా హిందీ రాకపోయినా బాలీవుడ్‌లో సక్సెస్ అయ్యారని గుర్తుచేస్తున్నారు. నటన అనేది భాషకే పరిమితం కాదని, భావోద్వేగాలను వ్యక్తపరచడమే ముఖ్యమని వారు అంటున్నారు. సినిమా ప్రమోషన్‌లలో మాట్లాడే భాషకు, తెరపై నటనకు నేరుగా సంబంధం ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పాత్రను సమర్థంగా పోషిస్తే చాలని, కేవలం భాష ఆధారంగా విమర్శించడం సరికాదని సూచిస్తున్నారు.
ఇక ‘ఏక్ దిన్’ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ నిర్మించగా, జునైద్ ఖాన్తో కలిసి సాయి పల్లవి నటించారు. ఈ ప్రేమకథా చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ వివాదం మధ్య కూడా సినిమాపై ఆసక్తి పెరుగుతోంది.