హ్యాట్రిక్ విజయాలతో యాషెస్ సిరీస్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
స్వదేశంలో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. పెర్త్, బ్రిస్బేన్ టెస్టుల్లో గట్టి దెబ్బకొట్టిన కంగారూ జట్టు, అడిలైడ్లో జరిగిన చావోరేవో మ్యాచ్లోనూ ఇంగ్లండ్ను మట్టికరిపించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే 3-0తో ఖాయం చేసుకుంది.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ ఐదో రోజు 207 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి ఇన్నింగ్స్ను కొనసాగించింది. జేమీ స్మిత్, విల్ జాక్స్ పోరాటంతో కొంత ఆశ చూపినా, మిచెల్ స్టార్క్ దెబ్బకు ఆ ఆశలు కరిగిపోయాయి. స్మిత్ 60 పరుగులు, జాక్స్ 47 పరుగులు చేసి ఔట్ కావడంతో ఇంగ్లండ్ ఓటమి ఖాయం అయ్యింది. స్టార్క్ ఈ ఇన్నింగ్స్లో 3 వికెట్లు పడగొట్టగా, నాథన్ లియాన్ కూడా కీలక సమయంలో 3 వికెట్లు తీశాడు.
ఇంతకుముందు నాలుగో రోజు ఓపెనర్ జాక్ క్రాలే 85 పరుగులతో ఇంగ్లండ్కు ఆశలు కల్పించాడు. కానీ ప్యాట్ కమిన్స్, లియాన్ టాపార్డర్ను వరుసగా పెవిలియన్కు పంపడంతో పర్యాటక జట్టు తీవ్ర ఒత్తిడిలో పడింది. జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ వికెట్లు కీలకంగా కోల్పోవడంతో ఇంగ్లండ్ తిరిగి కోలుకోలేకపోయింది. చివరికి 82 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఈ విజయంతో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ను హ్యాట్రిక్ విజయాలతో కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో మెరిసిన అలెక్స్ క్యారీకి ఈ మ్యాచ్లో అత్యుత్తమ ఆటగాడి పురస్కారం దక్కింది. యాషెస్లో మరోసారి ఇంగ్లండ్ చేతులెత్తేయగా, ఆస్ట్రేలియా అభిమానులకు ఇది ఘనమైన సంబరంగా మారింది.