janamvoice.com
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 5:09 pm Digital Edition : GATTU MAHESH

అక్రిడిటేషన్ కార్డుల్లో మహిళలకు 33% తప్పనిసరి!

అక్రిడిటేషన్ కార్డుల్లో మహిళలకు 33% తప్పనిసరి!

జనం వాయిస్, తెలంగాణ:

తెలంగాణ ప్రభుత్వం మీడియా అక్రిడిటేషన్ 2026 నిబంధనాల్లోపలు కీలక సవరణలు చేస్తూ ఇవాళ తాజాగా జీవో నెం.103ను విడుదల చేసింది.

ఈ సవరణల ద్వారా అక్రిడిటేషన్ల కేటాయింపులో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మరికొన్ని నిబంధనలల్లో ప్రభుత్వం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇక మీడియా యాజమాన్యాలు డెస్క్ జర్నలిస్టుల విభాగంలో కనీసం 33% శాతం మహిళలకు అవకాశం కల్పించడాన్ని తప్పనిసరి చేసింది.

అక్రిడిటేషన్ కోటాలో కూడా మహిళా జర్నలిస్టులకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని స్పష్టం చేసింది. 2.5 లక్షల కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు, 1.50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మండలాల్లో అదనంగా ఒక అక్రిడిటేషన్ కార్డు కేటాయించనున్నారు.

2.5 లక్షల సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు స్పోర్ట్స్, కల్చర్, ఫిలిం విభాగాల్లో రాష్ట్ర స్థాయిలో ఒక్కో అదనపు అక్రిడిటేషన్ కార్డును సర్కార్ మంజూరు చేసింది. అదేవిధంగా 75 వేల నుంచి 2.5 లక్షల లోపు సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు స్పోర్ట్స్, కల్చర్, ఫిలిం విభాగాల్లో ఏదో ఒకదానిలో రాష్ట్ర స్థాయిలో ఒక అదనపు కార్డును ఇవ్వనున్నారు. అలాగే ఉర్దూ బిగ్ న్యూస్ పేపర్ అనే పదాన్ని ఉర్దూ డైలీ న్యూస్ పేపర్ గా మార్చింది,

రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రతినిధితో పాటు పెద్ద దినపత్రికల నుంచి ఒక డెస్క్ జర్నలిస్ట్ ప్రతినిధిని కొత్తగా ఇద్దరు సభ్యులకు చోటు కల్పించనున్నారు. ఇకపై అక్రిడిటేషన్ నిబంధనల్లో ఎక్కడ ‘మీడియా కార్డు’ అని ఉన్నా దానిని ‘అక్రిడిటేషన్ కార్డు’గానే పరిగణించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సవరణలపై జర్నలిస్టు సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.