తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు మృతి.
– వీణవంక మండలం కొండపాకలో విషాదం.
జనం వాయిస్, జమ్మికుంట:
వీణవంక మండలం కొండపాక గ్రామంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గట్టు ఐలయ్య (55), వృత్తిరీత్యా గీత కార్మికుడు, తాటి చెట్టు మీదనుండి ప్రమాదవశాత్తు కింద పడిపోయి మృతి చెందాడు. శనివారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఐలయ్యను వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనతో కొండపాక గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మృతుడు ఐలయ్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఒక కుమార్తె వికలాంగురాలు. ఇద్దరు కుమారులు రాజు, శ్రీకాంత్ ఉన్నారు. కుటుంబానికి ఐలయ్యే ప్రధాన ఆర్థిక ఆధారం కావడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది.ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ, గీత కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అలాగే గట్టు ఐలయ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సంఘా నాయకులు, గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్థులు కోరుతున్నారు.