అమరావతి బ్రాండ్కు కొత్త ఊపిరి.
-‘ఆవకాయ’ పేరుతో సాంస్కృతిక ఉత్సవానికి శ్రీకారం.
జనం వాయిస్, అమరావతి, డిసెంబర్ 22:
అమరావతి బ్రాండ్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బలంగా నిలబెట్టే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో పర్యాటక శాఖ ‘ఆవకాయ’ పేరుతో సరికొత్త సాంస్కృతిక ఉత్సవాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. సినిమా, సంస్కృతి, సాహిత్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ వేడుకలను జనవరి 8 నుంచి 10 వరకు విజయవాడ కేంద్రంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ వివరాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. తెలుగు నేలపై పుట్టిన కథ, కవిత, సినిమా, సంగీతం, నాటకం వంటి అన్ని కళారూపాలను ఒకే వేదికపై ప్రదర్శించాలనే సంకల్పంతోనే ‘ఆవకాయ’ ఉత్సవాన్ని రూపకల్పన చేశామని ఆయన తెలిపారు. తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడమే ఈ ఉత్సవం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖతో పాటు టీమ్వర్క్ ఆర్ట్స్ సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ వేదికలుగా ఈ వేడుకలు జరగనున్నాయి. సాధారణంగా భవనాల లోపల మాత్రమే జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను తొలిసారిగా బహిరంగ ప్రదేశాల్లో, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో నిర్వహించడం ‘ఆవకాయ’ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్ ద్వారా తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటడంతో పాటు, సమకాలీన సృజనాత్మక ఆలోచనలకు కూడా పెద్దపీట వేయనున్నట్లు మంత్రి దుర్గేశ్ తెలిపారు. కళలు, సంస్కృతి, పర్యాటకం కలిసేలా రూపొందించిన ఈ ఉత్సవం అమరావతి బ్రాండ్కు కొత్త గుర్తింపునిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.