ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన మలుపు ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్నిప్రమాదం.
– ముఖ్య ఆధారాలు ఉన్న ప్రయోగశాలలో మంటలు.
– ముందే ధ్వంసమైన హార్డ్ డిస్కుల వ్యవహారం.
– చార్జిషీట్ దశలో అనుమానాస్పద ఘటన.
జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 7:
ఫోన్ ట్యాపింగ్ వంటి సంచలన కేసులకు సంబంధించి కీలక ఆధారాలు ఉన్న ఫోరెన్సిక్ ప్రయోగశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసులో సాంకేతిక ఆధారాలు కీలకంగా మారిన సమయంలోనే ఈ ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆధారాలను తుడిచివేయాలనే ఉద్దేశంతో హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి, మూసీ నదిలో పడేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ డిస్కులను దర్యాప్తు సంస్థలు తిరిగి సేకరించి, వాటిలోని సమాచారం వెలికితీయడానికి ఫోరెన్సిక్ ప్రయోగశాలలో డీకోడ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇలాంటి కీలక దశలోనే ప్రయోగశాలలో అగ్నిప్రమాదం జరగడం కేసు దిశను మరింత సున్నితంగా మార్చింది. వరుసగా హరీష్ రావు, కేటీఆర్, **కేసీఆర్**ల విచారణలు పూర్తయ్యాక, చార్జిషీట్ దాఖలు చేసే దశకు కేసు చేరుకున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం రాజకీయ వర్గాల్లోనూ, ప్రజల్లోనూ అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆధారాల పరిశీలన తుది దశకు చేరుకున్న వేళ ఈ ప్రమాదం జరగడం యాదృచ్ఛికమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది నిజంగా ప్రమాదమా? లేక ఎవరైనా కావాలని చేయించిన చర్యనా? అనే కోణంలో ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఆధారాలకు ఎంత మేర నష్టం వాటిల్లిందన్న అంశాలపై అధికారులు లోతైన విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత సంచలనంగా మారుతూ, రాబోయే రోజుల్లో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.