రూ.50 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఏసీబీకి పట్టుబాటు.
– నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు అరెస్ట్.
– వ్యవసాయ భూమి బదిలీ నివేదిక పేరుతో లంచం డిమాండ్.
– మధ్యవర్తి సహాయంతో లంచం స్వీకరణ.
జనం వాయిస్, కామారెడ్డి:
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్ యార్లగడ్డ శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతినిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుధారుడి తండ్రి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని ఫిర్యాదుధారుడి పేరు మీద బదిలీ చేసేందుకు అనుకూలంగా నివేదిక రాసి పంపేందుకు రూ.50 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
ఈ లంచం మొత్తాన్ని ఒక ప్రయివేటు వ్యక్తి అయిన చిన్నూరి అజయ్ ద్వారా స్వీకరిస్తుండగా తెలంగాణ అవినీతినిరోధక శాఖ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో పక్కా ప్రణాళిక ప్రకారం వల వేసిన అధికారులు, తహసీల్దార్తో పాటు మధ్యవర్తి పాత్రను కూడా బయటపెట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలని, లంచాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీబీ స్పష్టం చేసింది. ప్రజలకు అవినీతినిరోధక శాఖ మరోసారి విజ్ఞప్తి చేసింది. ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే వెంటనే తెలంగాణ అవినీతినిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేయాలని కోరింది. అలాగే వాట్సాప్ 9440446106, ఫేస్బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు భరోసా ఇచ్చారు.