janamvoice.com
Newspaper Banner
Date of Publish : 24 January 2026, 9:20 am Digital Edition : JANAM VOICE

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ పట్టుబాటు.

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ పట్టుబాటు.

– ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ఏసీబీ ట్రాప్ ఆపరేషన్.

జనం వాయిస్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతినిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఫిర్యాదుధారుని పేరిట 8.35 ఎకరాల భూమికి సంబంధించిన సాదా బైనామా రిజిస్ట్రేషన్ ఫైల్‌ను ప్రాసెస్ చేసి ముందుకు పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో ఈ ట్రాప్ ఆపరేషన్ జరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే తెలంగాణ ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ ఏర్పాటు చేసి, లంచం తీసుకుంటున్న సమయంలో నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ సేవకులు ఎవరైనా లంచం అడిగినట్లయితే ప్రజలు తప్పకుండా ఫిర్యాదు చేయాలని తెలంగాణ అవినీతినిరోధక శాఖ విజ్ఞప్తి చేసింది. లంచం డిమాండ్ చేసిన సందర్భాల్లో టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని సూచించింది. అలాగే వాట్సాప్ 9440446106, వెబ్‌సైట్ acb.telangana.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.
ఫిర్యాదుధారులు, బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ అధికారులు భరోసా ఇచ్చారు. అవినీతిపై ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.