ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్సై కి పదేళ్ల జైలు శిక్ష.
– గుంటూరులో సంచలనం సృష్టించిన తీర్పు.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో ఎస్సై రవితేజకు గుంటూరు జిల్లా నాలుగో అదనపు న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పు పోలీస్ శాఖతో పాటు సమాజంలోనూ చర్చనీయాంశంగా మారింది.
నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేసిన సమయంలో రవితేజ యువతితో సన్నిహితంగా మెలిగి, వివాహం చేస్తానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. విచారణలో ఆరోపణలు రుజువుకావడంతో న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది.
ప్రస్తుతం అమృతలూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవితేజకు శిక్ష విధిస్తూ కోర్టు స్పష్టమైన తీర్పు వెల్లడించింది. అధికార హోదాలో ఉండి చట్టాన్ని అతిక్రమించిన వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ఈ తీర్పుతో బాధితురాలికి న్యాయం జరిగిందని న్యాయవాదులు పేర్కొన్నారు. అలాగే మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్న సందేశాన్ని ఈ కేసు ఇస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.