‘పెద్ది’ వివాదంపై అనసూయ పరోక్ష వ్యాఖ్యలు.
జనం వాయిస్, సినిమా, జూన్ 6:
రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన ‘పెద్ది’ సినిమా చుట్టూ ఇటీవల నెలకొన్న వివాదంపై నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పరోక్షంగా స్పందించారు.
సినిమా అనేది సమాజానికి ఒక ప్రతిబింబం మాత్రమేనని, సమాజాన్ని పూర్తిగా మార్చాల్సిన బాధ్యత సినిమాలపైనే వేయడం సరికాదని ఆమె అన్నారు. సినిమాలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని తెలుసుకునే అవగాహన ప్రేక్షకులకు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో రచయితలు, దర్శకులు కూడా తమ బాధ్యతను గుర్తుంచుకోవాలని అనసూయ సూచించారు. సమాజంపై సినిమాలకు ప్రభావం ఉంటుందనే విషయాన్ని కూడా ఎవరూ మర్చిపోకూడదని ఆమె చెప్పారు.
ఒకప్పుడు సినిమాల్లో హీరో అంటే మంచివాడు, విలన్ అంటే చెడ్డవాడు అనే స్పష్టమైన విభజన ఉండేదని, కానీ ఇప్పుడు పాత్రలు మరింత సంక్లిష్టంగా మారాయని ఆమె పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో చెడును చూపించడమే కాకుండా దానిని గొప్పగా చూపిస్తున్నారా లేదా అనే తేడా ప్రేక్షకులకు గందరగోళంగా మారుతోందని అన్నారు.
తాను ఇలాంటి అభిప్రాయాలు చెప్పినప్పుడు విమర్శలు ఎదురవుతాయని, అయినా సమాజం పట్ల బాధ్యతగా మాట్లాడటం తన నమ్మకమని ఆమె స్పష్టం చేశారు. గతంలో ఒక టీవీ షో నుంచి తప్పుకోవడానికి కూడా ఇదే కారణమని తెలిపారు.
సినిమాల్లో తప్పులను ప్రశ్నించే నెటిజన్లను ఆమె ప్రశంసించారు. ప్రశ్నించడం సినిమా స్వేచ్ఛను అడ్డుకోవడం కాదని, అది మంచి మార్పుకు దారితీసే ప్రక్రియ అని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా స్వేచ్ఛతో పాటు సమాజం పట్ల బాధ్యత కూడా సమానంగా ఉండాలని అనసూయ వ్యాఖ్యానించారు.