ఓటు వేయలేదని డబ్బులు, కుక్కర్లు తిరిగి అడిగిన అభ్యర్థిపై ఆగ్రహం.
– అశ్వారావుపేట మున్సిపాలిటీలో ఘటన.
– అవమానకరంగా మాట్లాడారంటూ ప్రజల ఆగ్రహం.
– “ఇవ్వమని ఎవరడిగారు?” అంటూ నిలదీత.
జనం వాయినా, భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 12:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో ఓ కాంగ్రెస్ అభ్యర్థి ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. తనకు ఓటు వేయలేదని ఆరోపిస్తూ ముందుగా పంచిన డబ్బులు, కుక్కర్లు తిరిగి ఇవ్వాలని ప్రజలను కోరినట్లు సమాచారం. స్థానికుల వాదన ప్రకారం, ఓటు వేయలేదని కారణం చూపుతూ అభ్యర్థి అవమానకరంగా మాట్లాడినట్లు ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డబ్బులు, కుక్కర్లు ఇవ్వమని ఎవరడిగారని, ఎందుకు ప్రజలను అవమానిస్తున్నారని స్థానికులు నిలదీశారు. ఈ ఘటనపై వార్డు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురి చేసి, అనంతరం అవమానకరంగా వ్యవహరించడం తగదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాల్సిన హక్కు అని స్పష్టం చేశారు. ఈ సంఘటనపై స్థానిక అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
