డిగ్రీలో మరో 39 కోర్సులు.
జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 20:
రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి కొత్తగా మరో 39 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. డిగ్రీ, పీజీలు చదివే విద్యార్థులకు.. చదువు పూర్తి కాగానే.. ఉద్యోగం చేతికి వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. కొత్తగా తీసుకురానున్న జాబ్ ఓరియెంటెడ్ కోర్సులతో హైదరాబాద్ను పలు రంగాల్లో మరింత అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త విద్యా విధానంతో సుమారు 20 లక్షల ఉద్యోగాలు రానున్నాయని అంచనా వేస్తున్నాయి.ప్రస్తుతం ఏటా లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీలు, పీజీలు పూర్తి చేసి.. ఉద్యోగ వేట కోసం మార్కెట్లోకి వస్తున్నారు. అయితే చదివిన చదువుకు తగిన స్కిల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు రాక.. ప్రైవేటు కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. కంపెనీలకు కావాల్సిన స్కిల్స్ కొత్తగా కాలేజీల నుంచి బయటికి వచ్చిన విద్యార్థులకు లేకపోవడంతో.. వారిని తీసుకునేందుకు సంస్థలు వెనకడుకు వేస్తున్నాయి. దీంతో అటు విద్యార్థులకు ఉద్యోగాలు లేక.. ఇటు కంపెనీలకు స్కిల్స్ ఉన్న ఉద్యోగులు దొరక్క.. గ్యాప్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ గ్యాప్ను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కీలక చర్యలు చేపట్టనుందఇందులో భాగంగానే వచ్చే విద్యా సంవత్సరం (2026-2027) నుంచి రాష్ట్రంలోని అండర్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ)ల్లో 39 నూతన కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్ఈ) ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి స్పష్టం చేశారు. ఈ కొత్త కోర్సులకు సంబంధించిన సిలబస్ను జూన్-జులై నాటికి రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. తాజాగా ఈ కొత్త కోర్సులకు సంబంధించి స్టూడెంట్స్, ప్రొఫెసర్లతో మంగళవారం టీశాట్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ.. ప్రొఫెసర్లు అడిగిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.తెలంగాణ ప్రభుత్వ విజన్ 2047లో భాగంగా.. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడమే లక్ష్యంగా ఈ కొత్త కోర్సులను రూపొందించినట్లు ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానం ద్వారా రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయమని వెల్లడించారు. ఒక్క మ్యారిటైమ్ రంగంలోనే రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. కొత్తగా ప్రవేశపెట్టనున్న కోర్సుల ద్వారా తెలంగాణలో సుమారు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని అంచనా వేశారుఇదే కాకుండా ఏరోస్పేస్, డిఫెన్స్, ఫిన్టెక్, క్లైమేట్ సైన్స్, లైఫ్ సైన్సెస్, ఫుడ్ టెక్నాలజీ వంటి రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని టీజీసీహెచ్ఈ ఛైర్మన్ తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని ఫార్మా, ఏరోస్పేస్, లైఫ్ సైన్సెస్ హబ్గా డెవలప్ చేయడంలో ఈ కొత్త కోర్సులు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. ఇండస్ట్రీ-అకాడమీ అనుసంధానం కోసం ప్రాధాన్యతను ఇస్తూ.. పలు కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులకు తప్పనిసరిగా ప్రాక్టికల్స్, ఇంటర్న్షిప్లు, ఫీల్డ్ వర్క్, ఇండస్ట్రీ ప్రాజెక్ట్లను అమలు చేసి.. వాటికి కూడా క్రెడిట్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్లు తేల్చి చెప్పారు.గ్రామీణ విద్యార్థుల కోసం ల్యాండ్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ వంటి స్పెషల్ కోర్సులను కూడా ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్లకు పరిష్కారం కోసం క్లైమేట్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కోర్సులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భాగంగా ఐఐటీ మద్రాస్ సాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ట్యూటర్లను ప్రవేశపెడుతున్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ ఏఐ ట్యూటర్లు విద్యార్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేస్తాయని పేర్కొన్నారు. డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడైనా విద్యార్థులు చదువుకునే వెసులుబాటు కలుగుతుందని వివరించారు.