అవినీతి నిర్మూలనకు సామూహిక కట్టుబాటు అవసరం.-ఖమ్మంలో అవినీతి నిరోధక వారోత్సవ ర్యాలీ.
– జిల్లా జడ్జి రాజగోపాల్ ఆధ్వర్యంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన.
– టోల్ఫ్రీ ‘1064’—ఫిర్యాదుదారుల వివరాలు గోప్యం.
– అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు.
జనం వాయిస్,ఖమ్మం,డిసెంబర్09:
అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం సందర్బంగా అవినీతి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంపు కోసం ఖమ్మం పట్టణంలో విస్తృత కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 3 నుంచి 9 వరకు అవినీతి నిరోధక వారోత్సవాన్ని పాటిస్తున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో, ఖమ్మం జిల్లా జడ్జి జి. రాజగోపాల్ నేతృత్వంలో ర్యాలీ జరిగింది. న్యాయ అధికారులతో పాటు ‘అనిశా’ బృంద సభ్యులు మరియు ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.వివిధ కాలేజీలు, పాఠశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విద్యార్థులు కూడా ర్యాలీలో భాగమయ్యారు.పట్టణంలో అవినీతి వ్యతిరేక నినాదాలు, టోల్ఫ్రీ 1064 నెంబర్ ఉన్న బ్యానర్లతో ఈ ర్యాలీ నిర్వహించబడింది.ఈ నెంబర్ ద్వారా లంచం డిమాండ్ చేసే ఘటనలను తక్షణమే ఫిర్యాదు చేయవచ్చని అధికారులు ప్రజలకు సూచించారు.”ఎవరైనా లంచం అడిగితే వెంటనే 1064 కు కాల్ చేయండి, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి” అని జిల్లా జడ్జి ప్రజలకు స్పష్టం చేశారు.అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.అవినీతి నిరోధక వారోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ అవగాహన కార్యక్రమాలు, చర్చావేదికలు, మానవ శ్రేణులు కూడా నిర్వహించబోతున్నట్లు అధికారులు తెలిపారు.పౌరులు చురుకైన భాగస్వామ్యంతో అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని, యువత ఈ ఉద్యమంలో ముందుండాలని అధికారులు కోరారు.