పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.
– పెద్దపల్లి జిల్లా సంక్షేమ అధికారి పి. వేణుగోపాల్ రావు.
జనం వాయిస్, పెద్దపల్లి, ఏప్రిల్ 15:
హైదరాబాద్లోని శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణా సంస్థలో 2026-2027 విద్యా సంవత్సరానికి గానూ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి పి. వేణుగోపాల్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ బాలికలు, పాక్షిక అనాథలు (తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు), నిరుపేద బాలికలు, అక్రమ రవాణాకు గురైన బాధితులు, దివ్యాంగ బాలికలు, పదవ తరగతి పూర్తి చేసిన అర్హులైన బాలికలు ఎటువంటి ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ సెమీ కండక్టర్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ల్యాండ్ స్కేప్ 3 సంవత్సరాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (అనాథలకు మినహాయింపు), మరణ ధ్రువీకరణ పత్రం ( అనాథలకు మాత్రమే ), బోనఫైడ్, స్టడీ సర్టిఫికేట్లు, 2పాస్పోర్ట్ సైజు ఫోటోలతో తమ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలతో జతచేసి మే 25 లోపు పెద్దపల్లి పట్టణంలోని కోర్టు సమీపం లోని బాల రక్ష భవన్ కార్యాలయం నందు సమర్పించాలని, ఎంపికైన విద్యార్థినులకు ఉచిత విద్య, వసతి కల్పించబడుతుందని, పూర్తి వివరాలకు 9966676181, 6300398362 నంబర్లను సంప్రదించాలని జిల్లా సంక్షేమ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.