తెలంగాణలో కొత్త విప్ల నియామకం..
కాంగ్రెస్ నేతలకు కీలక బాధ్యతలు.
శాసనమండలిలో ఇద్దరు ఎమ్మెల్సీలు విప్లుగా నియామకం.
అసెంబ్లీకి ముగ్గురు ఎమ్మెల్యేలు విప్లుగా ఎంపిక.
తక్షణమే అమల్లోకి వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులు.
జనం వాయిస్, వెబ్ డెస్క్, మార్చి 19:
తెలంగాణలో శాసన వ్యవహారాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విప్లను నియమించింది. శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను విప్లుగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా, అసెంబ్లీలో కూడా విప్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను విప్లుగా నియమించారు. శాసనసభ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు వీరు కీలక పాత్ర పోషించనున్నారు.
విప్ల బాధ్యతల్లో భాగంగా పార్టీ సభ్యులను సమన్వయం చేయడం, శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో హాజరు, ఓటింగ్ వంటి అంశాల్లో పార్టీ నిర్ణయాలను అమలు చేయించడం ముఖ్యంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం శాసన వ్యవహారాల నిర్వహణలో మరింత క్రమబద్ధతను తీసుకువస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, బిల్లుల ఆమోదం వంటి కీలక అంశాల్లో పార్టీ శక్తిని సమన్వయం చేయడంలో విప్లు కీలకంగా ఉంటారు. ఈ నియామకాలతో కాంగ్రెస్ పార్టీ శాసన వ్యూహాలను మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
