మీరు బ్లూటూత్ను ఆన్లో ఉంచుతున్నారా?
– ఒక్క క్లిక్తో మీ బ్యాంకు అకౌంట్ ఖాళీ.. జాగ్రత్త!
జనం వాయిస్, డెస్క్:
నేటి రోజుల్లో బ్లూటూత్ వినియోగం విపరీతంగా పెరిగింది. వైర్లెస్ ఇయర్బడ్స్ వినడం, కార్ ఆడియోకు ఫోన్ కనెక్ట్ చేయడం, ఫొటోలు షేర్ చేయడం వంటి అవసరాలకు చాలామంది బ్లూటూత్ను ఉపయోగిస్తున్నారు. అయితే పని పూర్తయ్యాక కూడా బ్లూటూత్ను ఆన్లో ఉంచడం వల్ల భారీ ప్రమాదం పొంచి ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం వల్లే క్షణాల్లో బ్యాంకు ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. రద్దీగా ఉండే బస్సులు, రైళ్లు, మెట్రో స్టేషన్లు, మాల్స్, మార్కెట్లలో సైబర్ నేరగాళ్లు ప్రత్యేక పరికరాలతో బ్లూటూత్ ఆన్లో ఉన్న మొబైల్ ఫోన్లను గుర్తిస్తారు. అనంతరం మీ ఫోన్కు కనెక్షన్ అభ్యర్థన పంపిస్తారు. చాలాసార్లు ఆలోచించకుండా ఆ అభ్యర్థనను అంగీకరించడంతో మోసం మొదలవుతుంది.
ఒకసారి కనెక్షన్ ఏర్పడితే ఫోన్లో ఉన్న సందేశాలు, కాంటాక్టులు, బ్యాంకింగ్ సమాచారం వరకు నేరగాళ్లకు చేరే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వారు ఫోన్ను పూర్తిగా నియంత్రించి ఓటీపీలు, బ్యాంక్ అలర్ట్ మెసేజ్లను కూడా చూడగలుగుతారు. దీంతో బాధితుడికి తెలియకుండానే నిమిషాల్లో ఖాతా నుంచి డబ్బు మాయం అవుతుంది. ఈ తరహా మోసాల నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టం కాదు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే బ్లూటూత్ను ఆన్ చేసి, పని అయిపోయిన వెంటనే ఆఫ్ చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో బ్లూటూత్ను ఆన్లో ఉంచడం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. తెలియని పరికరాల నుంచి వచ్చే కనెక్షన్ అభ్యర్థనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు. అప్రమత్తంగా ఉంటేనే మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా సురక్షితంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.