తెలంగాణ కాంగ్రెస్ తదుపరి ఇన్చార్జ్ రేసులో అశోక్ గెహ్లాట్!
• ప్రస్తుత ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ విదేశీ పర్యటన.
• ఉన్నత విద్య కోసం 10 నెలలు సెలవుపై వెళ్లనున్న మీనాక్షి.
• రేసులో గెహ్లాట్తో పాటు ముకుల్ వాస్నిక్, శక్తిసిన్హ్ గోహిల్ పేర్ల పరిశీలన.
•త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనున్న కాంగ్రెస్ అధిష్టానం.
జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 14:
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య నిమిత్తం సుదీర్ఘ సెలవుపై వెళ్లనుండటంతో, ఆమె స్థానంలో గెహ్లాట్ పేరును పార్టీ అధిష్ఠానం ప్రధానంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుత ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆమె సుమారు 10 నెలల పాటు సెలవు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆమె గైర్హాజరీతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ పదవి ఖాళీ కానున్న నేపథ్యంలో, అశోక్ గెహ్లాట్తో పాటు సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, శక్తిసిన్హ్ గోహిల్ పేర్లను కూడా అధిష్ఠానం పరిశీలిస్తోంది. అయితే, అపార రాజకీయ అనుభవం ఉన్న గెహ్లాట్ వైపే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దీపా దాస్మున్షీ స్థానంలో 2025 ఫిబ్రవరి 14న మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జ్గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె ఏఐసీసీ పరిశీలకురాలిగా కూడా వ్యవహరించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందిన ఆమె, 2009లో మధ్యప్రదేశ్లోని మందసౌర్ లోక్సభ నియోజకవర్గం నుంచి 30,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కాగా, తెలంగాణ కొత్త ఇన్చార్జ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానం త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.