ఆటో డ్రైవర్ల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్.
– తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్.
– కాంగ్రెస్ హామీలు అమలు కాలేదని విమర్శ.
– ఖైరతాబాద్ ఆర్టీఏ ఎదుట ఆటో జేఏసీ నిరసన.
– ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక.
జనం వాయిస్,హైదరాబాద్,డిసెంబర్ 09:
ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ డిమాండ్ చేశారు. ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 12 వేలు అందిస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. “ఆత్మహత్యలు చేసుకునే స్థితికి చేరినా, వారి సమస్యలపై ఒకసారి కూడా మంత్రి వర్గంలో చర్చ జరగడం లేదంటే ఎంతటి నిర్లక్ష్యమో స్పష్టమవుతుంది” అని రూప్ సింగ్ అన్నారు.గత రెండు సంవత్సరాలుగా ఆటో యూనియన్లు ఎన్నిసార్లు నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.ఆటోమీద ఆధారపడే వేల కుటుంబాల భవిష్యత్తు సంక్షోభంలో ఉందని, ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజల నమ్మకాన్ని కోల్పోతుందని రూప్ సింగ్ స్పష్టం చేశారు. వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే జాగృతి తరఫున రాష్ట్రవ్యాప్తంగా నిరంతర పోరాటాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నది ఆటో డ్రైవర్ల ఆకాంక్షగా నిలుస్తున్న తరుణంలో, ఈ నిరసన రాష్ట్ర రాజకీయాల్లో మరో చర్చకు దారితీసింది.