janamvoice.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 3:55 pm Digital Edition : JANAM VOICE

కరీంనగర్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం.

కరీంనగర్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయం.

– మొట్టమొదటి బీజేపీ మేయర్ ప్రమాణ స్వీకారం.

– కార్యకర్తల కృషికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కృతజ్ఞతలు.

జనం వాయిస్, కరీంనగర్, ఫిబ్రవరి 16:

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ మేయర్ ప్రమాణ స్వీకారం చేయడం చరిత్రాత్మక ఘట్టమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్, ఉప మేయర్‌గా వై. సునీల్ రావు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఇది కేవలం రాజకీయ విజయం మాత్రమే కాకుండా భావోద్వేగ క్షణమని బండి సంజయ్ అన్నారు. కార్పొరేటర్‌గా వార్డుల వారీగా పాదయాత్రలు చేసిన రోజుల నుంచి ఈ రోజు వరకు సాగిన ప్రయాణం తనకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టిపై విశ్వాసం ఉంచిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విజయానికి ప్రతి కార్యకర్త కృషి కారణమని ఆయన స్పష్టం చేశారు. ఒత్తిళ్లు, బెదిరింపులు, అవమానాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పోరాడిన కార్యకర్తలే ఈ విజయానికి పునాది వేశారని పేర్కొన్నారు. కుట్రలు, ఒత్తిడి రాజకీయాల మధ్య కూడా బీజేపీ దృఢంగా నిలిచి విజయాన్ని సాధించిందన్నారు. కరీంనగర్ ప్రజలు మేయర్‌ను మాత్రమే ఎన్నుకోలేదు, చరిత్రను సృష్టించారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కేంద్ర నాయకత్వం అందించిన మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని పేర్కొన్నారు.