ఎలికేశ్వరం శివారులో యువకుడి మృతదేహం లభ్యం.. హత్యగా అనుమానాలు…?
- మహాదేవపూర్ మండలంలో కలకలం.
జనం వాయిస్, మహాదేవపూర్, భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం ఎలికేశ్వరం శివారులో ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. బొమ్మపూర్ గ్రామానికి చెందిన శనిగరం శ్రీకాంత్ (27) మూడు రోజుల క్రితం ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, ఎలికేశ్వరం శివారులో శ్రీకాంత్ మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మహాదేవపూర్ సామాజిక ఆసుపత్రికి తరలించారు. అయితే శ్రీకాంత్ మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు హత్య జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది.