కేసీఆర్పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిలుపు.
– రేపు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత నిరసనలు.
– గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పార్టీ ప్రకటించింది. తెలంగాణ జాతి పిత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుపై రాజకీయ వేధింపులు చేస్తున్నారంటూ వాటికి వ్యతిరేకంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించాలని భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది.
ఈ నిరసనల్లో భాగంగా రేపు రాష్ట్రంలోని పన్నెండు వేలకుపైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గ్రామ స్థాయి నుంచే ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేసి, ప్రభుత్వ చర్యలకు నిరసనగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. అదే విధంగా ప్రతి మున్సిపల్ కేంద్రం, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తిగా శాంతియుతంగా నిర్వహించాలని కూడా బీఆర్ఎస్ నేతలు సూచించారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ కక్షతో ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపిస్తూ ఈ నిరసనలు చేపడుతున్నామని పార్టీ స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ ఆందోళనలు రాజకీయంగా కీలకంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.