janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 January 2026, 8:38 pm Digital Edition : GATTU MAHESH

ప్రేమ వివాహం చేసిన యువకుడిపై అమానుష దాడి.

ప్రేమ వివాహం చేసిన యువకుడిపై అమానుష దాడి.

-ఏలూరు జిల్లా ముసునూరులో దారుణ ఘటన.
-స్తంభానికి కట్టేసి కొట్టిన యువతి బంధువులు.
-కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

జనం వాయిస్, ఏలూరు, జనవరి 01:

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న ఒక్క కారణంతో యువకుడిని స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టిన ఘటన ఏలూరు జిల్లాలో కలకలం రేపింది. ముసునూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో, యువతి బంధువులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమానుషంగా ప్రవర్తించిన తీరు స్థానికులను షాక్‌కు గురిచేసింది.
వివరాల ప్రకారం, ముసునూరుకు చెందిన సాయిచంద్, సాయి దుర్గ ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ వివాహానికి ఇరు కుటుంబాలు, ముఖ్యంగా యువతి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంట్లో పెళ్లికి అంగీకరించకపోవడంతో, రెండు రోజుల క్రితం ఈ జంట పరస్పర అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సాయి దుర్గ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సాయిచంద్‌ను పట్టుకుని గ్రామంలోనే ఒక స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టినట్లు సమాచారం. ప్రేమ వివాహం చేసుకున్నందుకు శిక్షించాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని బాధితుడి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. యువతి బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ వివాహాల పేరుతో జరుగుతున్న దాడులు చట్ట విరుద్ధమని, ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. బాధిత యువకుడికి అవసరమైన రక్షణ కల్పిస్తామని కూడా భరోసా ఇచ్చారు.