డిజిటల్ విధానంలో జనగణన…లోక్సభలో కీలక ప్రకటన.
-భారత చరిత్రలో తొలిసారి పేపర్లెస్ జనగణన.
పౌరుల కోసం ప్రత్యేక యాప్, వెబ్ పోర్టల్ ఏర్పాటు.
-2027లో కొత్త విధానంతో దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం.
జనం వాయిస్, న్యూఢిల్లీ, డిసెంబర్09:
దేశంలో జనాభా లెక్కల సేకరణ విధానంలో పెద్ద మార్పు చోటు చేసుకోనుంది. భారతదేశ చరిత్రలో తొలిసారిగా పేపర్ లేకుండా డిజిటల్ విధానంలో జనగణన చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లోక్సభలో ప్రకటించారు. సంప్రదాయ పద్ధతిని మార్చి సాంకేతికత ఆధారంగా వేగవంతమైన, పారదర్శకమైన లెక్కల సేకరణనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
డిజిటల్ జనగణన కోసం రెండు మొబైల్ యాప్లు, ఒక వెబ్ పోర్టల్ను ఇప్పటికే అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ యాప్లలో ఒకటి జనగణకుల కోసం సిద్ధం చేయగా, మరొకటి పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా రూపొందించారు. ఇంతకు ముందు ఓ వ్యక్తి నుంచి 30కు పైగా ప్రశ్నలు అడిగి లెక్కల సేకరణ జరిపేవారు. ఇప్పుడు ఆ ప్రశ్నావళి పూర్తిగా యాప్లలో ఉంటుంది. ఆసక్తిగల పౌరులు తమ వివరాలను యాప్ ద్వారా నేరుగా నమోదు చేసుకోవచ్చు. అనంతరం జనగణకులు ఇంటికి వెళ్లి ఆ వివరాలను పరిశీలించి ధృవీకరిస్తారు. ఈ విధానం వల్ల సమయం ఆదా అవుతుందని, పనితీరు వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనగణనను నిర్వహించడం భారతదేశపు సాధారణ పద్ధతి. 2011 తర్వాత 2021లో జరగాల్సిన తదుపరి జనాభా లెక్కలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. తాజా నిర్ణయం మేరకు 2027లో డిజిటల్ మోడ్లో జనగణన ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది.