వంటగ్యాస్ కొరత లేదని కేంద్రం స్పష్టం.
గృహ వినియోగదారులకు ఎల్పీజీ పూర్తిగా అందుబాటులో.
పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆందోళన అవసరం లేదు.
పర్షియన్ గల్ఫ్ నుంచి ఎల్పీజీ క్యారియర్ భారత్ వైపు.
జనం వాయిస్, న్యూఢిల్లీ, మార్చి 16:
దేశంలో వంటగ్యాస్ కొరత ఉందన్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గృహ వినియోగదారులకు వంద శాతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లోనూ గృహ అవసరాలకు సరిపడేంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా కూడా సమృద్ధిగా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని అన్ని చమురు శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని వెల్లడించింది. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, కొరతకు సంబంధించిన వార్తలు అసత్యమని కేంద్రం పేర్కొంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి బయలుదేరిన “శివాలిక్” ఎల్పీజీ క్యారియర్ హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటి భారతదేశానికి సమీపానికి చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. ఈ క్యారియర్ నేడు సాయంత్రం ఐదు గంటల సమయంలో భారత్ చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో దేశానికి మరింత ఎల్పీజీ సరఫరా అందుబాటులోకి రానుంది. పశ్చిమాసియా ప్రాంతంలో ఉన్న భారత నౌకల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపింది. ప్రతి నౌకలోని సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం 611 మంది సిబ్బందితో 22 భారతీయ జెండా కలిగిన నౌకలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.