janamvoice.com
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 4:27 pm Digital Edition : JANAM VOICE

తెలంగాణలో మారిన వాతావరణం: వర్ష సూచనలు.

తెలంగాణలో మారిన వాతావరణం: వర్ష సూచనలు.

పలు జిల్లాల్లో ఉరుములు, గాలులతో వర్షం అవకాశం.
మేఘాల ప్రభావంతో ఒక్కసారిగా మారిన పరిస్థితి.
రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగుదల సూచన.

జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 23:

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండలు మండిపోగా, అనంతరం ఆకాశం మేఘావృతమైంది. వేడి తీవ్రతతో ఉక్కపోత అనుభవిస్తున్న ప్రజలకు ఈ మార్పు కొంత ఉపశమనం కలిగించేలా కనిపిస్తోంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌తో పాటు కామారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రానున్న రెండు నుంచి మూడు గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలతో పాటు గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో పాటు క్యుములోనింబస్ మేఘాల ఏర్పాటుతో ఈ వాతావరణ మార్పులు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేఘాలు సాధారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు కారణమవుతాయని పేర్కొన్నారు. శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షపాతం ఉండొచ్చని తెలిపారు. రైతులు, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అయితే వర్షాలతో పాటు ఉష్ణోగ్రతల్లో కూడా మార్పులు ఉండనున్నాయి. రానున్న మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో వేడి, వర్షం కలగలిపిన పరిస్థితులు కొనసాగవచ్చని అంచనా. తెలంగాణలో మారుతున్న వాతావరణ పరిస్థితులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఒక్కసారిగా మారే వాతావరణానికి అనుగుణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.