పల్లె ప్రగతికి ప్రభుత్వ పాఠశాలలే పట్టుగొమ్మలు
-ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య
జనం వాయిస్, కాల్వశ్రీరాంపూర్:
కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య తల్లిదండ్రులు,గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు.పల్లె ప్రగతికి ప్రభుత్వ పాఠశాలలే పట్టుగొమ్మలని,ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విలువల ఆధారిత విద్యను అందిస్తున్నారని,ప్రభుత్వ పాఠశాలల ఆధ్వర్యంలో సమానత్వం,సమైక్యతను కాపాడే అనేక వినూత్నమైన,సామాజిక చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఫలితంగా పల్లె ప్రాంతాలు క్రమక్రమంగా అభివృద్ధి బాటలో ప్రయాణిస్తున్నాయన్నారు.ప్రభుత్వ పాఠశాలలు ప్రజల సొమ్ముతో నడుస్తున్నాయని,తల్లిదండ్రులు,గ్రామస్తులు తాము కష్టించి,సంపాదించిన డబ్బును వృధా చేసుకోకుండా,తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి గుణాత్మక విద్యను పొందాలన్నారు.
పిల్లలు ఉపాధ్యాయులైన వేళ.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఊషన్నపల్లి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో పిల్లలు ఉపాధ్యాయుల అవతారమెత్తారు.శుక్రవారం ఉదయాన్నే రంగురంగుల దుస్తులు ధరించి అందంగా ముస్తాబై పాఠశాలకు వచ్చారు.అమ్మాయిలు చీరలు కట్టుకొని ఉపాధ్యాయినులుగా తయారై వచ్చారు.నిన్నటి వరకు తమతో కలిసి విద్యాభ్యాసం చేసిన సహచరులు ఇప్పుడు ఉపాధ్యాయుల వేషధారణతో రావడంతో మిగతా విద్యార్థినీ,విద్యార్థులు ఆనందంతో ఉప్పొంగిపోయారు.తమ మిత్రులకు కరచాలనం చేస్తూ ఆత్మీయతను పంచారు.ఉపాధ్యాయులుగా వచ్చిన మిత్రులకు అభివాదం చేశారు.ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తమకు కేటాయించిన సబ్జెక్టులను చక్కగా బోధించారు.వీరి బోధనను పరిశీలించిన పాఠశాల ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టు నుంచి ముగ్గురుని ఉత్తమ బోధకులుగా ఎంపిక చేశారు.వీరికి రాబోయే గణతంత్ర దినోత్సవం నాడు బహుమతులను అందించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య,ఎఎపిసి సభ్యులు,ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, ఎడ్ల స్రవంతి,పిల్లల తల్లిదండ్రులు,మధ్యాహ్న భోజన నిర్వాహకులు కొత్తపల్లి విజయలక్ష్మి,ధరణి రజిని,పైడిపల్లి సతీష్,పిల్లలు,పలువురు పాల్గొన్నారు.