మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
– మనవడి కోరిక తీర్చిన రేవంత్ రెడ్డి
– స్వయంగా పూరీలు చేసి ఆప్యాయత చాటిన సీఎం
– వైరల్గా మారిన కుటుంబ ఆత్మీయ క్షణాలు
జనం వాయిస్, హైదరాబాద్, జులై 10:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనవడిపై ఉన్న ప్రేమాభిమానాలను మరోసారి చాటుకున్నారు. నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలు, పరిపాలనా బాధ్యతలతో బిజీగా ఉండే ముఖ్యమంత్రి కొంత సమయం కుటుంబ సభ్యులతో గడుపుతూ మనవడి కోరికను స్వయంగా నెరవేర్చారు. మనవడు కోరడంతో పూరీలు తయారు చేసి అతనికి అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
వీడియోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనవడితో ఎంతో ఆప్యాయంగా గడుపుతూ కనిపించారు. పూరీలు తినాలన్న మనవడి కోరిక మేరకు ఆయన స్వయంగా పిండిని ఒత్తి, నూనెలో వేయించి పూరీలు తయారు చేశారు. అనంతరం మనవడికి వాటిని అందిస్తూ ముచ్చటించిన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ముఖ్యమంత్రి, “మనవడు అడిగితే కాదనగలనా? నిరంతరం ప్రజాసేవలో తలమునకలై ఉండే జీవితంలో మనవడితో కలిసి పూరీలు చేసిన ఈ మధుర క్షణాలు మరువలేనివి” అంటూ భావోద్వేగ వ్యాఖ్యను జత చేశారు.
రాజకీయాలు, పరిపాలనా బాధ్యతల మధ్య లభించే కొద్దిపాటి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని రేవంత్ రెడ్డి గతంలోనూ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా మనవడితో గడిపే క్షణాలు తనకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోకు సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఇస్తూ సాధారణ తాతలా మనవడి కోరిక తీర్చిన తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. రాజకీయాలకతీతంగా ఆయన కుటుంబ ఆప్యాయతను ప్రతిబింబించిన ఈ దృశ్యాలు విస్తృతంగా పంచుకుంటున్నారు.