రేపు కరీంనగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి.
– 5న చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన.
– మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం.
– రాష్ట్ర వ్యాప్తంగా కరీంనగర్ బల్దియా పైనే ఫోకస్.
– నిరసనలకు పిలుపు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీ నేతలు.
జనం వాయిస్, కరీంనగర్:
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం కరీంనగర్ జిల్లా చొప్పదండిలో చకాచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈనెల 5న చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఇవాళ కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం, జిల్లా అధికారులతో కలిసి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం సభాస్థలిని పరిశీలించారు. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. మానేరు చెక్ డ్యాంల ధ్వంసంపై స్పందన, KNR-జగిత్యాల ఫోర్ లైన్ పెండింగ్ ప్రాజెక్టు, ఓదెల, కొండగట్టు ఆలయాల మాస్టర్ ప్లాన్పై సీఎం కీలక ప్రకటన చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. రేపటి పర్యటనలో ఆయన జిల్లాకు ముఖ్య నిర్ణయాలు ప్రకటిస్తారో లేదో అని జిల్లా వాసులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను అధికారులతో చర్చించారు. సభా స్థలిని పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సిపి వివరించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సత్యం తెలియజేశారు.