janamvoice.com
Newspaper Banner
Date of Publish : 30 June 2026, 8:56 pm Digital Edition : JANAM VOICE

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్..తొలి విడతగా రూ.2,482 కోట్లు రిలీజ్!

రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్..తొలి విడతగా రూ.2,482 కోట్లు రిలీజ్!

జనం వాయిస్, తెలంగాణ, జూన్ 30:

తెలంగాణలో వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని శిల్పాకళా వేదికలో కంప్యూటర్ బటన్ నొక్కి అధికారికంగా విడుదల చేశారు.

నిజానికి ఈ భారీ బహిరంగ సభను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జగన్నాధపురంలో నిర్వహించాల్సి ఉంది. అయితే గత రెండు రోజులుగా అక్కడ కురిసిన భారీ వర్షాల వల్ల సభా ప్రాంగణం బురదమయంగా మారడంతో, రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం చివరి నిమిషంలో వేదికను హైదరాబాద్‌కు మార్చింది.

ఈ తొలి విడత కింద ప్రభుత్వం మొత్తం రూ.2,482 కోట్ల నిధులను విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 41.37 లక్షల మంది చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లోకి నగదు నేరుగా జమ కానుంది. ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో నిధులు విడుదల చేస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులు అన్ని జిల్లాల లోని ‘రైతు వేదికల’ నుండి ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

బ్యాంకింగ్ సర్వర్లపై లోడ్ పడకుండా మరియు సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈసారి నిధులను ఒకే రోజు కాకుండా వరుసగా 9 రోజుల పాటు దశలవారీగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మొదటి రోజు 1 ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు నిధులు అందుతాయి. ఆ తర్వాత రోజుల్లో భూమి విస్తీర్ణం పెరిగే క్రమంలో మిగతా రైతులకు సొమ్ము జమ అవుతుంది. కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.