తెలంగాణను వణికిస్తున్న చలి.
-కోహిర్లో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత.. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.
జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 22:
తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రమైన చలిగాలులు వణికిస్తున్నాయి. సోమవారం పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిర్లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 5 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లెలో 6.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. మొత్తం 33 జిల్లాల్లో 17 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు చేరాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా అర్లిలో 8.3, వికారాబాద్ జిల్లా నవాబ్పేట్లో 8.7, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 9.5, కామారెడ్డిలో 9.7 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో రాత్రి వేళ చలి తీవ్రత మరింత పెరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏడు జిల్లాలకు కోల్డ్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో డిసెంబర్ 26 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు హైదరాబాద్, హనుమకొండ, కరీంనగర్, వరంగల్తో పాటు మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28, 13 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ బులెటిన్లో పేర్కొంది.