janamvoice.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 3:40 pm Digital Edition : GATTU MAHESH

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస నోటీసు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస నోటీసు.

స్పీకర్ పదవి నుంచి తొలగింపునకు ప్రతిపక్షాల ప్రయత్నం.
120 మంది ఎంపీల సంతకాలు.
రాజ్యాంగ ఆర్టికల్ 94-సీ ప్రకారం నోటీసు.

జనం వాయిస్, న్యూఢిల్లీ:

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చింది. స్పీకర్ పదవి నుంచి ఓం బిర్లాను తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఈ నోటీసు సమర్పించినట్లు కాంగ్రెస్ వెల్లడించింది. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత **రాహుల్ గాంధీ**కి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపించింది. అంతేకాదు, ఎనిమిది మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే చేసిన నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలను అవిశ్వాసానికి కారణాలుగా ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. అవిశ్వాస నోటీసు అనంతరం కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 94-సీ ప్రకారం ఈ నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే సహా పలు పార్టీలకు చెందిన మొత్తం 120 మంది ఎంపీలు ఈ అవిశ్వాస నోటీసుకు సంతకాలు చేశారని వెల్లడించారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను విపక్షాలు లేవనెత్తకుండా స్పీకర్ పదేపదే అడ్డుకోవడం తమను తీవ్రంగా బాధించిందని గౌరవ్ గొగొయ్ అన్నారు. పలు సందర్భాల్లో విపక్ష నేతలకు మాట్లాడే హక్కును నిరాకరించారని, అది ఎంపీల ప్రాథమిక హక్కు అని గుర్తుచేశారు. రాజ్యాంగపరమైన హక్కులను వినియోగించుకున్నందుకే ఎనిమిది మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.