ఆకతాయిల ఆటకట్టించిన మహిళా సీపీ.
– సాధారణ మహిళగా బస్టాండ్లో నిలబడ్డ మల్కాజిగిరి సీపీ సుమతి.
– అర్ధరాత్రి ప్రత్యేక ఆపరేషన్తో పోకిరీల అసలు రంగు బయటపెట్టడం.
– యువకులను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు.
జనం వాయిస్, హైదరాబాద్, మే-06:
మహిళల భద్రత కోసం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి స్వయంగా రంగంలోకి దిగారు. ఇటీవలే మల్కాజిగిరి సీపీగా బాధ్యతలు చేపట్టిన ఆమె బుధవారం అర్ధరాత్రి కీలక ఆపరేషన్ నిర్వహించి ఆకతాయిల ఆగడాలను బయటపెట్టారు. సీపీ సుమతి సాధారణ మహిళలా మారి బస్టాండ్లో ఒంటరిగా నిలబడ్డారు. అక్కడ ఉన్నవారికి ఆమె పోలీస్ కమిషనర్ అన్న విషయం తెలియకపోవడంతో పలువురు యువకులు ఆమె చుట్టూ చేరి వేధింపులకు పాల్పడ్డారు. సుమారు నలభై మంది వరకు యువకులు ఆమెను ప్రశ్నలతో ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎక్కువ మంది విద్యార్థులే ఉండటం గమనార్హంగా మారింది. మహిళలు రాత్రి వేళల్లో ఎదుర్కొనే ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకే ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
కొంతసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళల భద్రత విషయంలో రాజీపడబోమని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజా ప్రదేశాల్లో మహిళలను ఇబ్బంది పెట్టే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని వెల్లడించారు. మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని పోలీసులు సూచించారు.